చంద్రబాబు పీడ ఇంకా పోలేదు:హరీశ్
సముద్రంలో కలిసే వృథా నీటికి కూడా సీమాంధ్ర సీఎం చంద్రబాబు మోకాలడ్డు వేయడం హేయమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రం విడిపోయినా చంద్రబాబు పీడ పోలేదన్నారు. వరంగల్ జిల్లా దేవరుప్పుల నల్లకుంట చెరువు పునరుద్ధరణ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
గోదావరి ద్వారా 994 టీఎంసీల నీరు, కృష్ణా నది ద్వారా 376 టీఎంసీల నీరు తీసుకునే నైతిక హక్కు తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కరీంనగర్, వరంగల్ జిల్లాలు సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరంలో బ్యారేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తే.. చంద్రబాబు మాటలు, ఆయన వ్యవహారం ఎండిన బతుకుల్లో నిప్పులు పోసేలా ఉన్నాయని ఆరోపించారు.