వేధించి.. వెంటాడి చంపేశారు!

వేధించి.. వెంటాడి చంపేశారు! - Sakshi


 లావణ్యది ప్రమాదం కాదు హత్యే అంటున్న బంధువులు


పరవాడ: విశాఖలో పోకిరీల ఆగడాలకు ఓ వివాహిత బలైంది. సాలాపువానిపాలెం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటూరి లావణ్య మరణించలేదని, అనకాపల్లికి చెందిన పలువురు యువకులు కారుతో ఢీ కొట్టి హత్య చేశారని లావణ్య బంధువులు ఆరోపిస్తున్నారు.



బంధువుల వివరాల ప్రకారం... వడ్లపూడికి చెందిన లావణ్య, ఆమె భర్త అప్పలరాజు, ఆమె ఆడపడుచు దివ్వ కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై అనకాపల్లి నూకాలమ్మ ఆలయానికి దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో అనకాపల్లికి చెందిన దాడి హేమకుమార్, అతని స్నేహితులు లావణ్య దంపతులను ఉదయం నుంచి వేధించడం ప్రారంభించారు. దీంతో హేమకుమార్, అతని స్నేహితులను లావణ్య భర్త అప్పలరాజు సున్నితంగా మందలించాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు వారిని వెంబడిస్తూ మరింతగా వేధింపులకు గురిచేశారు. అమ్మవారి దర్శనం ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తున్న లావణ్య దంపతులను కారులో వెనుక నుంచి వెంబడిస్తూ ఇబ్బందులకు గురిచేశారు.


లావణ్య దంపతులు సాలాపువానిపాలెం దాటుతున్న సమయంలో హేమకుమార్, అతని స్నేహితులు వెనుక నుంచి కారుతో ఢీ కొట్టి లావణ్య మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. కారును పరవాడ వద్ద వదిలి పారిపోయారన్నారు. హేమకుమార్, అతని స్నేహితులు పరారీలో ఉన్నారని, వారి ఇళ్లకు తాళాలు వేసి ఉండడాన్ని గమనిస్తే వారు కావాలనే లావణ్యను కారుతో ఢీకొట్టి హత్య చేశారని స్పష్టమవుతోందన్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top