చేనేత పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు


గద్వాల : ఈ ప్రాంతంలో చేనేత పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వ చేనేత అభివృద్ధి శాఖ కమిషనర్‌ అలోక్‌కుమార్, టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌ కవితాగుప్తా, టెక్స్‌టైల్స్‌ కార్యదర్శి రేష్మివర్మలు రాష్ట్ర అధికారులను ఆదేశించారు. సోమవారం గద్వాల పట్టణం రాఘవేంద్రకాలనీలో మగ్గం నేస్తున్న చేనేత కార్మికుల ఇళ్లను పరిశీలించారు. చేనేత పరిశ్రమ స్థితిగతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

 

అనంతరం వారు మాట్లాడుతూ మొదట వందమంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు పంపాలన్నారు. తర్వాత ఉపాధి అవకాశాలను బట్టి పార్కును విస్తరించాలని సూచించారు. గద్వాలలో హ్యాండ్‌ల్యూమ్‌ వర్క్‌షెడ్, డైయింగ్, డిజైనింగ్, నేతబజార్‌ ఏర్పాటుచేస్తామన్నారు. దీనికికి 55శాతం కేంద్ర ప్రభుత్వం, 10శాతం నిధులు చేనేత కార్మికులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు.

 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కార్మికులకు అందించాలనే లక్ష్యంతో గద్వాలలో రూ.రెండుకోట్లతో మెగా చేనేత క్లస్టర్‌ ఏర్పాటు చేసి, ఆయా రంగాలలో శిక్షణ ఇస్తామన్నారు. కార్మికులు ఉత్పత్తి చేసే చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. వీరిని ఎమ్మెల్యే డీకే అరుణ కలిసి కార్మికుల స్థితిగతులను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చేనేత సంచాలకులు ప్రీతిమీనా, టెస్కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top