ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటం
సాక్షి, గుంటూరు ఈస్ట్: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోడానికి నిరాకరించడంతో ఓ యువతి అతని ఇంటి ఎదుట మౌనపోరాటానికి దిగింది. వివరాలు.. గుంటూరు శ్రీనగర్కు చెందిన అక్షయదీప్తి దూరవిద్య ద్వారా డిగ్రీ చదువుతూ మోడలింగ్ చేస్తోంది. ఏడాది క్రితం పాత గుంటూరుకు చెందిన పల్వాది చైతన్యతో వాట్స్అప్, ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
చైతన్య విజయవాడలోని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకోగా చైతన్య తల్లిదండ్రులు కట్నకానుకలు ఎక్కువగా అడిగారు. తాము అంత ఇచ్చుకోలేమని దీప్తి తల్లిదండ్రులు వెనుకడుగు వేశారు. ఆ తర్వాత కూడా చైతన్య కొన్నాళ్లు దీప్తితో చనువుగా వ్యవహరించినప్పటకీ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆమె అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది.
పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ చైతన్యలో మార్పు లేకపోవడంతో ఆగస్టు 19న ఒకసారి, ఆ తర్వాత ఎస్పీ గ్రీవెన్స్లో మూడుసార్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అరండల్పేట స్టేషన్లో చైతన్య తరఫున ఓ ఎస్ఐ బేరం పెట్టడంతో మనస్తాపం చెంది ఎస్పీ కార్యాలయంలో మరో రెండుమార్లు ఫిర్యాదు చేసింది. ఎంతకీ ఫలితం లేకపోవడంతో దీప్తి గురువారం చైతన్య ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. దీంతో చైతన్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళంవేసి వెళ్లిపోయారు. చైతన్య అరండల్పేట పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోవడంతో పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు తరలించారు.