సమస్యల వలయంలో సర్కార్‌ బడులు


బలిజిపేట రూరల్‌: ఈనెల 12వ తేదీ నుండి ప్రారంభం కానున్న సర్కారు పాఠశాలలో సమస్యలు విలయతాండవాలు చేస్తున్నాయి. పాఠశాల ఆవరణలు మురికి కూపాల్లా కనిపిస్తున్నాయి. పాఠశాలల వద్ద ఏర్పాటుచేసిన మరుగుదొడ్లు మరమ్మత్తులకు గురయి కనిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల వద్ద శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఉండడంతో ఏసమయంలో ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని విద్యార్థులు, తల్లిదండ్రులు భయకంపితులు అవుతున్నారు.



పాఠశాలల విద్యార్థులకు రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం కల్పించేందుకు వెంగాపురం ఎలిమెంటరీ పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన వాటర్‌ట్యాంకు పైపులైన్లు విరిగి, ట్యాంకు మూలకుచేరి ఉంది. నారాయణపురం ఉన్నత పాఠశాల ఆవరణ మురికి కూపంలా కనిపిస్తున్నాది. అక్కడ మరుగుదొడ్లను వెళ్ళాలంటే నరకమే. బలిజిపేట ఉన్నత పాఠశాల ఆవరణలో శిథిలావస్థ భవనం ఉండడంతో పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. కొన్ని పాఠశాలలకు ప్రహారీలు లేకపోవడంతో అంతా అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top