10 రోజుల్లో న్యాయం జరగకుంటే ధర్నా చేస్తాం
గుంటూరు: గుంటూరు లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనుల్లో పునాది తీస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఏడుగురు మృతి చెందటానికి బిల్డర్ నిర్లక్ష్యమే కారణమని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. కూలీల మృతికి కారణమైన బిల్డర్ను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో మృతులు సునీల్, ప్రశాంత్, సలోమన్, రాజేష్, శేషుబాబు, సుధాకర్, రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
ప్రమాదం జరిగిన అనంతరం మృతుల కుటుంబాలకు 30 లక్షలు ఎక్స్ గ్రేసియా, ఐదెకరాల భూమి కూడా ఇస్తామని హామీ ఇచ్చారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇన్ని హామీలు ఇచ్చినా ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం నేరుగా 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. 10 రోజుల్లో న్యాయం జరగకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని వైఎస్ జగన్ హెచ్చరించారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
-
డబ్బులిస్తే వెళ్లిపోతామన్న కూలీలతో పనిచేయించి చంపారు -
30 అడుగులు తవ్వితే మట్టిపెళ్లలు కూలుతాయన్న సంగతి ఎవరికైనా తెలుసు -
కూలీల మృతికి బిల్డరే కారణం, ఇంత వరకు బిల్డర్ను అరెస్ట్ చేయలేదు -
వర్క్మన్ ఇన్సూరెన్స్ తీసుకుని బిల్డర్ పర్మిషన్ తీసుకోవాలి -
ఇన్సూరెన్స్ డబ్బు కూలీలకు ఎందుకు ఇవ్వడం లేదు? -
అంటే నిబంధనలు చూడకుండా బిల్డింగ్కు పర్మిషన్ ఇచ్చారా? -
బిల్డర్ దగ్గర నుంచి కనీసం 25 లక్షల రూపాయలు వసూలు చేయాలి -
5 లక్షల రూపాయల చొప్పున కూలీ కుటుంబానికి ప్రభుత్వం నేరుగా ఇవ్వాలి -
10 రోజుల్లో న్యాయం జరగకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తాం -
మృతుల కుటుంబాలకు మద్దతుగా నేను ధర్నాలో కూర్చుంటా