ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిందే..
విజయనగరం పూల్బాగ్ : జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు.సీపీఎం పది రోజుల పాటు నిర్వహించిన పాదయాత్రలో గుర్తించిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. పాదయాత్రలో సుమారు 154కు పైగా సమస్యలను గుర్తించామని, వాటన్నింటినీ పరిష్కరించాలని కలెక్ట ర్ను కోరారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ.. జిల్లాలో పేద ప్రజల వైద్య అవసరాలు తీర్చే కేంద్రాస్పత్రిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు చూడటం తగదన్నారు. జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.జగన్మోహనరావు మాట్లాడుతూ.. గుర్ల గెడ్డ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి, సాగునీరు అందించాలని కోరారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో రైతులు, దళితులు, వృత్తిదారులను సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎస్ఎంఎస్, మైలాన్, సీపీ ఆక్వా, హెచ్బీఎల్, వేదా బయోఫ్యూయల్, బయోటెక్, రొయ్యల కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్య కారక వ్యర్థజలాల వల్ల భూగర్భ, సముద్ర జలాల విషతుల్యమవుతున్నాయని.. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వి.ఇందిర, రెడ్డి వేణు, డి.అప్పలరాజు, పి.రమణమ్మ, ఆర్.ఆనంద్, టి.జీవా, ఆర్.రాములు, బుడతనాపల్లి సర్పంచ్ బి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.