అడుగంటిన గోదావరి


బాసర(ముథోల్‌): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రం బాసరలో గోదావరి నది అడుగంటిపోతోంది. వాతావరణ మార్పుల వల్ల కొన్నేళ్లుగా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గుతోంది. నాసిక్‌లో పుట్టిన గోదావరి నాందేడ్‌ మీదుగా తెలంగాణలో బాసర పుణ్యక్షేత్రం మీదుగా ప్రవహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతీ అమ్మవారిని దర్శించుకుంటారు. గోదావరి నీటి ప్రవాహం తగ్గి నీటిమట్టం అడుగంటుతుండడంతో భక్తులు పుణ్యస్నానాలకు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా గోదావరి వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.

 

మత్స్యాకారులకు ఉపాధి కరువు

నిర్మల్‌ జిల్లాలోని బాసర, లోకేశ్వర్, నర్సాపూర్, దిలావర్‌పూర్, నిర్మల్, సోన్‌ మండలాల మత్స్యకారులు, గంగపుత్రుల 200 కుటుంబాలు గోదావరి నదిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏప్రిల్‌లోనే నది అడుగంటిపోవడంతో మత్స్యకారులకు ఉపాధి కరువై ఇబ్బందులు తలెత్తుతోంది. దీంతో వేరే ప్రదేశాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతోంది. వారి కుటుం»బ సభ్యులు సైతం గోదావరిలో తెప్పలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.

 

తాగునీటికీ ఇక్కట్లే..

బాసర వద్ద గోదావరి నది అడుగంటిపోవడంతో బాసర క్షేత్రానికి వచ్చే భక్తులు, గ్రామానికి తాగునీటికి కష్టాలు తప్పవు. గత సంవత్సరం ఇదే మాసంలో గోదావరి నది పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో భక్తులు తాగునీటి కష్టాలు ఎదుర్కొన్నారు. గోదావరి నది తీరం వద్ద ఆలయాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే భక్తులకు ఇబ్బందులు తప్పుతాయి.

 

ఉపాధి కరువైంది..

- కంబోలి సాయిలు, గంగపుత్రుడు, బాసర

గోదావరి పూర్తిగా అడుగంటిపోవడంతో గంగపుత్రులకు ఉపా«ధి కరువైంది. గత మూడేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో గోదావరి నదిలో నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. గత సంవత్సరం నీళ్లు బాగానే ఉన్నా పది నెలలు కూడా గడవక ముందే ఎడారిగా మారింది.

 

జీవనోపాధి కల్పించాలి

- తోట చిన్న గంగాధర్‌, మత్స్యకారుడు, బాసర

గోదావరమ్మను నమ్ముకుని 200 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాం. భక్తులు వేసే నాణేలు ఏరుతూ పొట్టను నింపుకొంటున్నాం. గోదారమ్మ వద్ద తెప్పలను అమ్ముకుంటూ జీనం కొనసాగిస్తాం. అధికారులు స్పందించి మాకు జీవనోపాధిని కల్పించాలి.

 

తాగునీటికి ఇబ్బంది..

- కస్తూరి, భక్తురాలు నిజామాబాద్‌

గత మూడు సంవత్సరాలుగా గోదావరి నీళ్లులేక ఎండిపోయింది. ఈసారి వర్షాలు సంవృద్ధిగా కురవడంతో గోదావరి నిండుకుండలా కనిపించింది. గోదావరి నదిలో నీరు లేక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top