వైభవంగా వరాహ జయంత్యుత్సవం
అహోబిలం (ఆళ్లగడ్డ) : వరాహ జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జామున వరాహ క్షేత్రంలో కొలువైన వరాహ నారసింహస్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంగళ వాయిద్యాలతో స్వామి వారికి తిరుమంజనం నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు.