భూమికి భూమే కావాలి
– ఎక్వాయిపల్లిలో రైతుల ప్రజాభిప్రాయ సేకరణ
– ఫార్మాసిటీ ఏర్పాటు కోసం అసైన్డ్భూమిని గుర్తించిన ప్రభుత్వం
ఆమనగల్లు : మండల పరిధిలోని ఎక్వాయిపల్లిలో ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూసేకరణ చేయడానికిగాను మంగళవారం అధికారులు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు భూమిని తాము ఇవ్వడంలేదని, భూమికి బదులుగా భూమిని ఇవ్వాలని, భూ సేకరణ నిలిపివేయాలని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం ఆవరణలో భూసేకరణపై ఆమనగల్లు తహసీల్దార్ అనిత ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ ఎక్వాయిపల్లిలో ప్రభుత్వం 1523 ఎకరాల భూమిని సేకరించడానికి నిర్ణయించిందని, ఇందులో 805ఎకరాల అసైన్డ్భూమి ఉందని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే భూమికి రైతులకు పరిహారం అందిస్తుందని అన్నారు. అనంతరం గ్రామంలో అసైన్డ్ భూముల వివరాలు, వాటి పట్టాదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎలా బతకాలి...
ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములను సాగుచేసుకుంటున్నామని, ఇప్పుడు భూములను తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. బోర్లు వేసుకుని పంటలు సాగు చేసుకుంటున్న భూములను తీసుకుంటే ఎలా అని, మరో చోట భూమి ఇస్తేగాని వదులుకోబోమని చెప్పారు. భూసేకరణను వెంటనే నిలిపివేయాలని మరికొందరు రైతులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్వాయిపల్లి సర్పంచ్ వెంకటయ్య, మాజీ వైస్ ఎంపీపీ వీరయ్య, ఎంఆర్ఐ హరిందర్రెడ్డి, ఎఆర్ఐ ఫయీం, వీఆర్ఓలు, రైతులు పాల్గొన్నారు.