ఎమ్మెల్సీ సీటును జగనన్నకు కానుక ఇద్దాం
– వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కర్నూలు (ఓల్డ్సిటీ): పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ స్థానాన్ని గెలిచి తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇద్దామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి అధ్యక్షతన గ్రాడ్యుయేట్లతో గెట్టుగెదర్ సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్నికల ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. ఈ ఎన్నికలను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థికి ఒకటో నంబర్ ప్రాధాన్యతలో గెలిపించాలని కోరారు.
వైఎస్ఆర్సీపీ సత్తా చాటుదాం:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి వైఎస్ఆర్సీపీ సత్తా చాటుదామని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకర్గ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలతో గెలుపొందారని, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం లక్ష పైచిలుకు ఓట్లతో అధికారం చేజిక్కించుకున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ రాయలసీమలోని మూడు జిల్లాల్లో బలంగా ఉందని, తప్పక గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. మార్చి మొదటి, రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని గ్రాడ్యుయేట్లు అందరూ వినియోగించుకోవాలని సూచించారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం వైఎస్ఆర్సీపీదేనని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్రెడ్డి, కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి హఫీజ్ ఖాన్, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి, యూత్ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రఘు, జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు పోచా శీలారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్, పార్టీ నాయకులు బోదేపాడు భాస్కర్రెడ్డి, కరుణాకర్రెడ్డి, జగన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.