అమరావతి శంకుస్థాపనకు ముహుర్తం ఖరారు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముహుర్తం ఖరారైంది. రాజధానికి ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు శంకుస్థాపన జరగనుంది. భూమి పూజ చేసిన ప్రాంతంలోనే శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. కాగా రాజధాని శంకుస్థాన కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తే సాధారణంగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ఈవెంట్గా దీన్ని నిర్వహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 1 నుంచే ప్రచారం : ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఆ స్థాయిని శంకుస్థాపనలోనే చూపించాలని ఆత్రుత పడుతోంది. శంకుస్థాపన ప్రచారాన్ని అక్టోబర్ 1 నుంచే మొదలు పెట్టనున్నారు. పత్రికలు, టీవీలతోపాటు సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, విజయవాడ అవసరమైతే ఢిల్లీలో ఈ ప్రమోషనల్ ఆడియో, వీడియోలను ప్రదర్శిస్తారు. ఇందు కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే సీఆర్డీఏ ఉన్నతాధికారులు పలు అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలతో సంప్రదించినట్లు సమాచారం.