10మంది పవన్ కల్యాణ్ అభిమానుల అరెస్ట్
భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో పదిమంది పవన్ కల్యాణ్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ పలువురు పవన్ అభిమానులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. దీంతో సద్దుమణిగిందనుకున్న సమస్య మళ్లీ రాజుకుంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్, ప్రభాస్ అభిమానుల మధ్య ఫ్లెక్సీ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. గుర్తు తెలియన వ్యక్తులు పవన్ ఫ్లెక్సీ చింపివేయడంతో ...అభిమానులు రెచ్చిపోయి ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులను ధ్వసం చేశారు.
ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తుల ధ్వంసం కేసులో పదిమందిని అదుపులోకి తీసుకున్న భీమవరం టూ టౌన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత మూడు రోజులుగా భీమవరంలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు అవుతోంది. మరోవైపు పట్టణంలో ఏర్పాటు చేసిన పవన్, ప్రభాస్ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. కాగా అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువమంది విద్యార్థులే ఉండటంతో వారి భవిష్యత్పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.