తిరుమలలో మరో అగ్నిప్రమాదం
- టీటీడీ ఫారెస్ట్ విభాగం అప్రమత్తతో తగ్గిన నష్టం
తిరుమల: శేషాచలంలో మంగళవారం రేగిన మంటలు ఆరకముందే తిరుమలకు సమీపంలో బుధవారం మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయానికి కిలోమీటరు దూరంలోని గోగర్భం డ్యాం వద్ద అటవీ ప్రాంతం దగ్ధమైంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. టీటీడీ అటవీ శాఖ రేంజర్ రామ్లానాయక్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. డ్యాం నుంచి నీళ్లు తెప్పించి మంటలు ఆర్పే పని చేపట్టారు. మరికొందరు సిబ్బంది ఈతాకు మట్టలతో మంటలు ఆర్పారు. తక్షణమే అధికారులు స్పందించడంతో ఐదు ఎకరాల్లోపే అడవి దగ్ధమైంది. వృక్ష, జంతు నష్ట తీవ్రతను తగ్గించారు.
శేషాచలమంతటా బూడిద
శేషాచలం అడవుల్లో మంగళవారంనాటి మంటలు ఇంకా ఆరలేదు. బుధవారం కూడా ఆ ప్రాంతంలో చిన్నపాటి మంటలు వచ్చాయి. ఈదురుగాలుల కారణంగా గాల్లోకి లేచిన బూడిద శేషాచలమంతా విస్తరించింది. తిరుమలకు సమీపంగా వెళ్లిన వాహనాలపై కూడా బూడిద కనిపించింది.