విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
విద్యారణ్యపురి : తరగతి గదిలో అస్వస్థతకు గురై మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆందోళన చేశారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి సంగెం రాజబాబు సోమవారం తరగతి గదిలో అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా మృతిచెందిన విషయం తెలిసిందే. అస్వస్థతకు గురికాగానే వెంటనే కారులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తే బతికేవాడని, ఆటోలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి వారితోమాట్లాడారు.
విద్యార్థి కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం అందజేత
కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం సంగెం రాజబాబు మృతిపట్ల ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. రాజబాబు ఏటూరునాగారం మండలం ఉప్పనపెల్లిచెందినవారు. అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించిన ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మి, అధ్యాపకులు కలిసి రూ.30 వేలను అతడి తల్లిదండ్రులకు అందజేశారు. మానవీయ కోణంలో రాజబాబు దహన సంస్కారాలకోసం ఈ సాయం చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
సంబంధిత వార్తలు