చెరువులు, కుంటలు నింపాలి
పెద్దకొత్తపల్లి : మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం రెండో ఎత్తిపోతల నుంచి జొన్నలబొగుడ రిజర్వాయర్ ద్వారా చెరువు, కుంటలు నింపి పొలాలకు సాగునీరు అందించాలని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నాగం జనార్దన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఈ రిజర్వాయర్ వద్ద మోటార్లు, సర్జిపుల్ సంపు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి మోటారు ద్వారా వారం రోజుల్లో జొన్నలబొగుడ వద్ద నీటిని నింపి గుడిపల్లి మూడో ఎత్తిపోతలకు నీటిని సరఫరా చేయాలన్నారు. 29వ ప్యాకేజీ వద్ద కాల్వ పనులు వెంటనే పూర్తి చేయించాలన్నారు. రెండురోజుల్లో మోటార్లను పనిచేయిస్తామని సీఈ ఖగేందర్ బదులిచ్చారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని నాగం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడోవిడత రుణమాఫీని ఇంతవరకు రైతులకు పంపిణీ చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరారెడ్డి, వెంగళ్రావు, అర్థం రవి, కాశన్న, రవీందర్రెడ్డి, భద్రయ్య, డీఈ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.