చిరుతల కట్టడికి ఫెన్సింగ్
టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశం
సాక్షి, తిరుమల:
తిరుమలలో చిరుతల కట్టడికి కోసం అతిథిగృహాలు, అటవీమార్గాలు ఆనుకుని ఉండే ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నేతృత్వంలో జరిగిన అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు, హోటల్స్ నిర్వాహకులు వ్యర్థాలు అతిథిగృహాల ప్రాంతాల్లో వేయటం వల్ల వాటిని తినేందుకు జంతువులు వస్తుంటాయని, వాటిని వేటాడేందుకు చిరుతలు వస్తున్నాయని తేల్చారు. భక్తులతోపాటు హోటల్స్ నిర్వాహకులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ చిరుతల కట్టడి కోసం అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించారు.
అతిథిగృహాల వద్ద చెట్ల తొలగింపు
చిరుత సంచారం నేపథ్యంలో అతిథిగృహాల వెనుక ఉండే చెట్లు, ముళ్ల పొదల్ని మంగళవారం తొలగించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో దాని పాద ముద్రలు సేకరించారు. చిరుతల సంచరించుకుండా కట్టడి చేసే ప్రాథమిక చర్యలు ప్రారంభించారు.
జూలై 29న తిరుమలలో ‘‘వనం–మనం’’
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘‘వనం–మనం’’ కార్యక్రమాన్ని ఈనెల 29వ తేదిన తిరుమలలో చేపట్టాలని టీటీడీ ఈవో సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు.