భార్యపై అనుమానంతో పిల్లలను చంపేశాడు..
పాయకరావుపేట(విశాఖ): భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు పిల్లలను చంపి పోలీసులకు లొంగిపోయాడు. విశాఖ జిల్లా పాయరావుపేట మండలం నామవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాలిక సత్తిపండు అలియాస్ సత్తిబాబు నిర్మల దంపతులు నాలుగేళ్ల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు హనీప్రియ(మూడున్నర), కార్తీక్(ఏడాదిన్నర) ఉన్నారు. కాగా, ఇటీవల సత్తిపండు భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం కూడా గొడవ జరిగింది. అనంతరం భార్య ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా రాత్రి ఏడుగంటల సమయంలో సత్తిపండు ఇద్దరు పిల్లలను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం స్థానిక పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.