అన్నదాత ఆగమే!

దెబ్బతిన్న నర్సన్నపేటలో గ్రామ విత్తనోత్పత్తి పథకం కింద వేసిన సోయాబీన్‌ పంట - Sakshi


వరద విపత్తుతో రైతన్న దిగాలు

పంట చేలపై చీడపీడల దాడి

నీట మునిగి ఎర్రబారిన సోయాబీన్‌

నేల రాలుతున్న పత్తి పూత, కాయలు

తొలి అంచనాలో 50 వేల హెక్టార్లలో నష్టం

తాజాగా 25 వేల హెక్టార్లకు కుదింపు

గగ్గోలు పెడుతున్న రైతన్న


సాక్షి, సంగారెడ్డి: అది సెప్టెంబర్‌ 22.. వర్షం కురిసిన రాత్రి. ఆ రోజు నుంచి కుండపోతే. విస్తారమైన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లాయి. చేలను ముంచెత్తాయి. కోత కొచ్చిన పునాస నీటి పాలైంది. కోసిన పంట మొలకెత్తింది. రైతన్న కాయకష్టం గంగలో కలిసింది. యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. వరద పాలైన పంటల వివరాలను లెక్కగట్టింది.


53377.20 హెక్టార్ల పంట నష్టం జరిగిందని ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. తాజాగా వ్యవసాయ శాఖ ఆ నివేదికను ఉపసంహరించుకుంది. కేవలం 25.5 వేల హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగిందని నివేదించింది. ఈ నివేదికతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు.


తొలి నివేదిక ఇలా...

వరుసగా వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలు పునాస పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. జిల్లాలో కురిసిన కుండపోతే కాదు కర్ణాటక, మహారాష్ట్ర వరదలు తోడవడంతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లి పంట చేల వైపు నీళ్లు మళ్లాయి. కొన్ని చోట్ల పంట పూర్తిగా నీళ్లలో మునిగిపోగా... మరికొన్ని చోట్ల ఎడతెరిపి జల్లుల కారణంగా పంటలు చీడపీడల బారిన పడ్డాయి.


జిల్లాలోని 46 మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. జిల్లాలో ప్రధాన పంటలైన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్‌ కోత కొచ్చిన సమయంలో నీటి పాలయ్యాయి.  కొన్ని కోసిన మొక్కజొన్నలు కళ్లాలోనే నీళ్లలో తడిసి మొలకెత్తాయి. పంట నష్టం వివరాలను అంచనా వేయడానికి రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖ 53377.20 హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని, రూ.48.47 కోట్ల విలువైన పంట నష్టం జరిగిందని అంచనా వేసింది.  25,076 హెక్టార్లలో మొక్కజొన్న, 11,937 హెక్టార్లలో పత్తి, ఆరు వేల హెక్టార్లలో సోయాబీన్, 2,944 హెక్టార్లలో వరి, 1,424 హెక్టార్లలో జొన్న, 1,270 హెక్టార్టలో కంది, 3.20 హెక్టార్లలో చెరకు పంటలు దెబ్బతిన్నాయని నివేదించింది.


తొలి నివేదిక ప్రకారం మండలాల వారీగా నష్టం ఇలా..

మెదక్‌ మండలంలో 40 హెక్టార్లు, మనూరు మండలంలో 32 హెక్టార్లు, కోహీర్‌లో 84, కొండాపూర్‌లో 39.20, జిన్నారంలో 522, చిన్నశంకరంపేటలో 250, పాపన్నపేటలో 20, కోహీర్‌లో 2,240, రేగోడ్‌లో 250 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రాయికోడ్‌లో 3,750 హెక్టార్లు, మునిపల్లిలో 650, జహీరాబాద్‌లో 2,600, న్యాల్‌కల్‌లో రెండు వేలు, ఝరాసంగంలో 150, కొల్చారంలో 13 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. ములుగులో 3,906, జగదేవ్‌పూర్‌లో 10,275, వర్గల్‌లో 4,504, గజ్వేల్‌లో 9,070, కొండపాకలో 6,160, తూప్రాన్‌లో 2,098 హెక్టార్లలో పంట దెబ్బ తిన్నదని స్పష్టమైన లెక్కలు వేసి నివేదిక ఇచ్చింది.


సీఎం దత్తత గ్రామాల్లో ఇలా...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామాలు నర్సన్నపేట-ఎర్రవల్లిలో విత్తనోత్పత్తి పథకం కింద 790 ఎకరాల్లో సోయాబీన్‌ వేశారు. పంట చేలు ఏపుగా పెరిగాయి. దాదాపు పంట కూడా చేతికంది వచ్చింది. కాయలు పండుబారిన దశలో కోయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, గ్రామస్తులు నిర్ణయించారు.


ఇంకో వారం పదిరోజులైతే పంట కోతకు వచ్చేది. అనుకోకుండా భారీ వర్షాలు రావటం, కూడవెల్లి వాగు పొర్లటంతో జోన్‌ -1 వ్యవసాయ పరిశోధన క్షేత్రంలోని పంట పూర్తిగా నీటిలో మునిగిపోయింది. రెండు రోజుల తరువాత పంట తేలింది. కానీ నీటిలో మునగటంతో మొక్కలు ఎర్రబడి పంట పూర్తిగా పోతోంది. ఇది ఒక్క నర్సన్న పేటలో కాదు జిల్లా అంతటా ఇదే పరిస్థితి.


తాజా నివేదిక

నిజానికి ప్రాథమిక అంచనా కంటే పూర్తి స్థాయి సర్వేలో పంట నష్టం పెరగాలి. కానీ విచిత్రంగా ఇక్కడ మాత్రం సగానికి సగం తగ్గింది. 25,501 హెక్టార్లలో మాత్రమే పంట దెబ్బతిన్నదని కేవలం రూ.19 కోట్ల విలువైన నష్టం జరిగిందని అధికారులు మలి నివేదికలో పొందుపరిచారు. తొలి నివేదికలో మొక్కజొన్న పంట నష్టం 25,076 హెక్టార్లని చెప్పిన అధికార్లు  మలి నివేదికలో కేవలం 1,887 హెక్టార్లు మాత్రమే అని నివేదించారు.


సోయాబీన్‌ తదితర పంటల నష్టం విస్తీర్ణం కూడా కుదించి నివేదించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతకొచ్చిన మొక్కజొన్న నీటిలో తడవటంతో గింజ నాణ్యత, రంగు కోల్పోతాయని, రంగు పోయిన ధాన్యానికి ధర వచ్చే అవకాశం లేదని,  వారం రోజులపాటు ఎండలు లేకుండా కంకి పూర్తిగా నీళ్లలో తడవటం ఫంగస్‌ సోకిందని, ఆ గింజలకు మార్కెట్‌లో కొనేదిక్కు ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పొట్టకొట్టి నష్ట పరిహారం నుంచి తప్పించుకునేందుకే అధికారులు ఇలాంటి తప్పుడు నివేదికలు సృష్టించారని రైతులంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top