నేల బావిలో పడి రైతు కూలీ మృతి
వంగర : అరసాడ గ్రామ పరిధిలోని చినప్పడు పంట పొలం సమీపంలో ఉన్న నేల బావిలో ప్రమాదవశాత్తు పడి మేకల సత్యం(52) అనే రైతు కూలీ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 25వ తేదీన కూలి పని కోసం వరి నారు తీతకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా నేలబావిలోకి స్నానానికి సత్యం దిగాడు. ఆయనకు ఫిట్స్ ఉండడంతో స్నానం చేస్తూ బావి అడుగు భాగంలోకి జారి మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు రాగోలు లక్ష్మణరావు, రాగోలు అప్పన్న, పెదపెంకి ముత్తయ్యలు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మంగళవారం సత్యందొర మృతదేహం వెలికితీశారు.
విషయం తెలుసుకున్న భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాము ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడుకు భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై.మధుసూధనరావు తెలిపారు.