పంట నీట మునగడంతో రైతు ఆత్మహత్య
అమరావతి (గుంటూరు జిల్లా) : అమరావతి మండలం మునుగోడుకు చెందిన కౌలు రైతు గడ్డం వెంకటరావు (45) అప్పుల బాధతో ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్లుగా మిరప, పత్తి సాగులో నష్టం రావడంతో రూ.3 లక్షల మేర అప్పులయ్యాయి. ఈ ఏడాది ఏడెకరాలు కౌలుకు తీసుకుని రూ. 3 లక్షల పెట్టుబడి పెట్టి పత్తి, మిరప సాగు చేశాడు.
గురువారం ఎద్దువాగు పొంగడంతో ఏడెకరాలు పూర్తిగా నీటమునిగి పంట దెబ్బతింది. దీంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక ఇంటికొచ్చి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటరావుకు భార్య విజయ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.