టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు

టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు - Sakshi


∙ మండల అధ్యక్ష పదవికి పోటీ చేసిన వ్యక్తిపై దాడి

∙ వాహనం, నగదు, బంగారు లాక్కొని నిర్బంధానికి యత్నం

∙ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు, అనుచరులపై ఫిర్యాదు




టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఓ మాజీ ఎమ్మెల్యే తమ్మునిపై పోటీకి నిలబడిన సీనియర్‌ బీపీ నాయకుడు, మాలేపాడు ఉప సర్పంచ్‌పై ప్రత్యర్థి వర్గీయులు మంగళవారం దాడికి తెగబడ్డారు.



దుస్తులు చిరిగేలా చితక్కొట్టారు. అంతటితో ఆగకుండా అతని బొలెరో జీపు, జేబులో ఉన్న రూ.2.10 లక్షల నగదు, 50 గ్రాముల బంగారు ఆభరణాలను సైతం లాక్కున్నారు. సమాచారం అందుకున్న టీడీపీ మీడియా అధికార ప్రతినిధి బొమ్మనచెరువు శ్రీరాములు, బీసీ సంఘాల నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్బంధంలో ఉన్న బాధితుడిని విడుపించుకు వచ్చి మంగళవారం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.




మదనపల్లె టౌన్‌: రూరల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీ పెద్దూరుకు చెందిన కోలారు నారాయణప్ప (57)టీడీపీ సీనియర్‌ నాయకుడు. ప్రస్తుతం మాలేపాడు ఉపసర్పంచ్‌. మంగళవారం మదనపల్లెలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యాడు. తిరుగు ప్రయాణంలో బొమ్మనచెరువు పంచాయతీ సందిరెడ్డిపల్లె మీదుగా మాలేపాడుకు బయల్దేరాడు.



ఆయన రాకను ముందుగానే పసిగట్టిన ఆ పార్టీలోని ప్రత్యర్థి వర్గీయులు సందిరెడ్డిపల్లెకు చెందిన సిద్ధారెడ్డి, గుత్తా వెంకటరమణ, మల్లికార్జున తదితరులు నారాయణప్ప జీపును అడ్డగించారు. డ్రైవర్‌ను కిందకు దించి నారాయణప్పపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి ప్రధాన కారణం గత నెల 30న జరిగిన మండల అధ్యక్ష (సంస్థాగత)ఎన్నికలకు బీసీ తరఫున మాజీ ఎమ్మెల్యే తమ్ముడిపై పోటీ చేయడమేనని నారాయణప్ప తెలిపారు. అనంతరం బాధితున్ని పోలీస్‌ స్టేషన్‌ నుంచి హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వీఆర్‌పీఎస్, బీసీ సంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకుని బాధితున్ని పరామర్శించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top