సారా నిరోధానికి నిరంతర దాడులు


ఒంగోలు: జిల్లాలో సారా నిరోధానికి నిరంతర దాడులు కొనసాగుతున్నాయని జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వి.మధుసూదనరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ర్టంలోనే నాటు సారా రహిత జిల్లాగా ప్రకాశం మొదటి స్థానంలో నిలిచిందని, అయినా నవోదయం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలని జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్ హౌస్ అధికారులను ఆదేశించారు.



సారా ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ సిఐలు మూకుమ్మడిగా దాడులు నిర్వహించి అరికట్టేందుకు నిరంతరం పాటుపడాలని సూచించారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, చీరాల, పొదిలి, ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నల్లమల అటవీ ప్రాంతంలో బెల్లం ఊట తయారీకి అవకాశం ఉండకుండా తరుచుగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల ఎర్రగొండపాలెం మండలంలోని గంగుపల్లె గ్రామంలో 15 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం చేసుకొని, నిందితుడు మోహనరావును అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో  సారా వల్ల కలిగే అనర్ధాలు, అనారోగ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top