నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబానికే
► ఇంకా ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
► మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు
మంచిర్యాల: నీళ్లు... కేసీఆర్ ఫాంహౌజ్కు, నిధులు... కేసీఆర్ ఇంట్లోకి, ఉద్యోగాలు... కేసీఆర్ కుటుంబానికే అందుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ కే.ప్రేమ్సాగర్రావు అన్నారు. ఆదివారం మండలంలోని హాజీపూర్లోని ఓ రైస్మిల్లులో మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. అంతకు ముందు ముల్కల్ల, హాజీపూర్లలోని అంబేద్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రా నాయకులు అరవై ఏళ్లు దోచుకుంటే... కేసీఆర్ రెండేళ్లలోనే దోచేశాడని ఆరోపించారు.
ఓ వైపు వివిధ రకాలుగా పెరిగిన ధరలతో అవస్థలు పడుతున్న ప్రజలకు పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలు కారణంగా ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందుల్లోకి నెడుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా దండేపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అక్కల కృష్ణ, మంచిర్యాలకు గోల్ల శ్రీనివాస్లను నియమిస్తూ నియామక ఉత్తర్వులను అందజేశారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు సుంకి సత్యం, బుద్దార్థి రాంచందర్, కొత్త సత్తన్న, రాసమల్ల శ్రీనివాస్గౌడ్, పడాలశ్రీనివాస్, రావుల లక్ష్మణ్బాబు పాల్గొన్నారు.