'ఐ లవ్ యూ డాడీ, మమ్మీ'
దివాన్చెరువు (రాజానగరం) : తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్చెరువు గ్రామంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కలకలం రేపింది. బొమ్మూరు సీఐ కనకరావు కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన దామర నవీన్కుమార్ (19) డిప్లొమా పూర్తి చేశాడు. రాజానగరం సమీపంలోని గైట్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరంలో నేరుగా చేరాడు. మరో ఇద్దరు ఫస్టియర్ విద్యార్థులతో కలసి దివాన్చెరువులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. ఆ ఇద్దరు విద్యార్థులూ ఉదయం 7.30 గంటలకు సెమిస్టర్ పరీక్షల కోసం కళాశాలకు వెళ్లిపోయారు.
నవీన్కుమార్ ఉదయం 9 గంటలకు కళాశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ వెళ్లలేదు. ఉదయం 11 గంటల సమయంలో రూముకు వచ్చిన మరో మిత్రుడితో కొంతసేపు మాట్లాడినట్టు చెబుతున్నారు. కాగా, రూమ్మేట్స్ ఇద్దరూ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కళాశాల నుంచి తిరిగి వచ్చారు. తలుపు తట్టినా తీయకపోవడంతో నిద్రపోతున్నాడనుకుని, వేరే పనిపై సెంటర్కు వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు వచ్చి తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి, కిటికీ అద్దాలు బద్దలుగొట్టారు. లోపల ఫ్యాన్కు నవీన్కుమార్ తాడుతో ఉరి వేసుకు ఉండడం గమనించిన ఆ ఇద్దరూ పెద్దగా కేకలు వేస్తూ తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే అతడు మృతిచెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ సౌమ్యలత, సీఐ కనకారావు, ఎస్సై కిషోర్కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ హాస్టల్లో నవీన్ కుమార్తోపాటు సుమారు 30 మంది విద్యార్థులుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులే అతడి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. మృతుని వద్ద లభించిన సూసైడ్ నోట్లో ‘ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లైక్ యూ, ఇంతవరకూ సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని రాసి ఉంది. మృతుని తండ్రి డీవీ రామకృష్ణ బొబ్బిలిలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో వార్డెన్గా పని చేస్తూ కొడుకును చదివిస్తున్నాడు. ఆయనకి పోలీసులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.