ఎన్కౌంటర్ కలకలం
– ఎదురు కాల్పుల్లో జిల్లాకు చెందిన మావో అయినపర్తి మధు మృతి
– మృతుల్లో మరో ఇద్దరు జిల్లా వాసులు ఉన్నట్టు అనుమానం
– ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో జంత్రి గ్రామం వద్ద ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లోని జంత్రి గ్రామం వద్ద పోలీసులు, మావోయిస్ట్ల మధ్య సోమవారం జరిగిన ఎదురు కాల్పులు జిల్లాలో కలకలం సృష్టించాయి. ఈ ఎన్కౌంటర్లో జిల్లాకు చెందిన ముగ్గురు మావోలు మరణించారని సమాచారం అందింది. అయితే, అర్ధరాత్రి వరకూ జిల్లాకు చెందిన అయినపర్తి దాసు (మధు) ఒక్కరే మృతి చెందినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. దేవరపల్లి మండలం పల్లంట్లకు చెందిన అయినపర్తి మధు ప్రస్తుతం ఆంధ్రా ఒడిశా బోర్డర్కు చెందిన దళంలో జిల్లా కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మధు సుమారు పదేళ్ల క్రితమే వారిని విడిచి వెళ్లియాడు. సోమవారం వేకువజామున జరిగిన ఎన్కౌంటర్లో మధు మృతిచెందాడు. ఆయన సుమారు 20 సంవత్సరాల కిత్రం మావోయిస్ట్ ఉద్యమంలో చేరాడు. భార్య గర్భిణిగా ఉండగా కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. అప్పటినుంచి భార్య కమలకుమారి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. కుమార్తెకు వివాహం కాగా, ఒక కుమారుడు రెస్టారెంట్లో, మరో కుమారుడు కూలి పని చేసుకుంటున్నారు. మరోవైపు మధు బావమరిది గెడ్డం సువర్ణరాజు అలియాస్ కిరణ్ (21) కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు సమాచారం. పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. కిరణ్ బం««దlువులు మాత్రం అతను మతి చెందినట్టు తెలిసిందని చెబుతున్నారు. తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన కిరణ్ 8వ తరగతి చదువుతున్న సమయంలో బావ ఇంటికి వెళ్లిపోయాడు. తన బావ ద్వారా మావోయిస్ట్ దళంలో కొరియర్గా చేరాడు. ఆ సమయంలో విజయనగరంలో పోలీసులకు పట్టుబడి. విశాఖపట్నం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించి వచ్చాడు. ఆ తరువాత 5 నెలలపాటు మలకపల్లిలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ దళంలోకి వెళ్లిపోయాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. మరోవైపు మావోయిస్ట్ కేంద్ర పాలకమండలిలో ఉన్న సింహాచలం అలియాస్ సుధాకర్ కూడా పోలీస్ కాల్పుల్లో మతి చెందినట్టు సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని కూడా అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. సుధాకర్ 22 ఏళ్ల వయసులో పెదపాడు మండలం సత్యవోలు నుంచి వెళ్లిపోయాడు. 1983కి ముందు తల్లి సరస్వతిని చూసేందుకు అప్పుడడప్పుడూ వచ్చి వెళ్లేవాడు. 1983లో తల్లి చనిపోవడంతో అప్పటినుండి రావడం మానేశాడని అన్న ఆనందరావు తెలిపారు. సుధాకర్ గురించి పోలీసుల నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని చెప్పాడు.
జిల్లాలో మావోల ప్రస్థానం ఇలా..
ఒకప్పుడు మావోయిస్ట్ కార్యకలాపాలకు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం కీలకంగా ఉండేది. పలు ఎన్కౌంటర్లలో ముఖ్యనేతలు చనిపోవడంతో 2008 తర్వాత మావోయిస్ట్ కదలికలు తగ్గిపోయాయి. కేవలం షెల్టర్ జోన్గా మాత్రమే ఏజెన్సీ ప్రాంతాన్ని వాడుకుంటున్నారు. జిల్లాకు చెందిన మావోయిస్ట్ నేతలు మాత్రం ఏవోబీలో పనిచేస్తున్నారు. ఇటీవల గోదావరి ఆవలి వైపున చింతూరు ప్రాంతంలో మావోయిస్ట్ కదలికలు పెరిగాయి. గతంలో మావోయిస్ట్లకు సంబంధించి ఏజెన్సీ పోలీస్స్టేçÙన్ల్లో 17 కేసులు నమోదయ్యాయి. 2000 మార్చి 17న పోలవరం మండలం చిలకలూరు సమీపంలో జలతారు వాగు వద్ద మొట్టమొదట ఎన్కౌంటర్ జరిగింది. ఇరువర్గాలకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్లతో సహా బి.నాగేంద్రప్రతాప్ అనే కానిస్టేబుల్ మతిచెందాడు. 2000 జూలై 30న బుట్టాయగూడెం మండలం లక్ష్మీపురం సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో వీరన్న దళం డిప్యూటీ దళ కమాండర్ నరకాసుర మృతిచెందాడు. 2000 నవంబర్లో పట్టిసీమ సమీపంలో ఆటోలో వెళుతున్న ముగ్గురు మావోయిస్ట్లను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 2001జనవరి 12న ఊట్లగూడెం సమీపంలో న్యూడెమోక్రసీ దళం ప్లీనరీ జరుగుతుండగా పోలీసులు చుట్టుముట్టారు. ఇరువర్గాల కాల్పుల్లో దళ కమాండర్ ధర్మన్నతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా మరణించారు. 2004 నవంబర్ 16న జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో దళ కమాండర్ చింతా భాస్కరరావు అలియాస్ రమేష్ అలియాస్ ప్రభాకర్ అలియాస్ భాస్కర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2005 మార్చి 18న క్రాంతి దళం సభ్యులు బుట్టాయగూడెం మండలం పందిరమామిడిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సును తగులబెట్టారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్టు ప్రకటించారు. 2005 ఏప్రిల్ 6న పోలవరం మండలం ఎల్ఎన్డీపేట డేరాకొండ సమీపంలో జనశక్తి కార్యదర్శి క్రాంతితోపాటు దళ సభ్యుల సమాచారం తెలిసి గ్రేహౌండ్ పోలీసులు చుట్టుముట్టగా ఇరువర్గాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్ట్లు మతిచెందారు. 2005 మే 23న జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెంలో గెద్దాల సరితను అరెస్ట్ చేసి 8ఎంఎం రైఫిల్, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలవరం మండలం ఎల్ఎన్డీపేట సమీపంలో 2005 జూలై 9న జరిగిన ఎన్కౌంటర్లో రాజన్న వర్గానికి చెందిన ఇద్దరు దళ సభ్యులు మతిచెందారు. 2006 సెప్టెంబర్ 13న పోలవరం మండలం ములకలగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్ట్లు మృత్యువాతపడ్డారు. 2008 జూలై 10న బుట్టాయగూడెం మండలం రెడ్డికోపల్లెలో 9 మంది దళ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో డిసెంబర్ 15న జంగారెడ్డిగూడెం సమీపంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన 13మందిని అరెస్ట్ చేసి 9 తుపాకులు, 344 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పోలవరం మండలం ఎల్ఎన్డీ పేటలో కిరాణా వ్యాపారిని ఇన్ఫార్మర్ నెపంతో పాయింట్ బ్లాంక్ రేంజిలో మావోలు కాల్చి చంపారు. 2014 తర్వాత ఏజెన్సీలో న్యూడెమోక్రసీకి చెందిన రెండువర్గాలు తిరుగుతున్నాయి. అయితే వీరివల్ల ఎటువంటి ప్రమాదం లేనందున పోలీసులు పెద్దగా దృష్టి పెట్టలేదు. తాజాగా ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో జిల్లావాసులు పెద్దసంఖ్యలో ఉన్నారన్న వార్తలు రావడంతో కలకలం రేగింది.