పంచాయతీలకు విద్యుత్ బిల్లుల భారం
నరసాపురం రూరల్: పంచాయతీలకు విద్యుత్ బిల్లులు భా రంగా మారాయని, యూనిట్ చార్జీలను తగ్గించాలని ఢిల్లీలో బుధవారం జరిగిన జాతీయస్థాయి స్వచ్ఛభారత్, తాగునీటి పొదుపు వర్క్షాపులో రాష్ట్ర సర్పంచ్ల ప్రతినిధిగా వెళ్లిన నరసాపురం మండలం కొప్పర్రు సర్పంచ్ జీఎస్ లక్ష్మీఫణి గళమెత్తారు. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా పంచాయతీలకు విద్యుత్ బిల్లులు భారంగా మారాయన్నారు. ప్రస్తుతం పంచాయతీలు వినియోగిస్తున్న విద్యుత్ యూనిట్ చార్జి రూ.6 ఉందన్నారు. గ్రామాల్లో సగటున ఒక్కరు 60 లీటర్లు నీటిని వినియోగిస్తున్నారని, దీనిని 100 లీటర్లకు పెంచడంతో పాటు విద్యుత్ చార్జీలు తగ్గిస్తేనే పంచాయతీలు ఆర్థికంగా నిలదొక్కుకోగలవని అన్నారు. శుద్ధిచేసిన తాగునీటిని అం దించడంలో భాగంగా పంచాయతీలకు విద్యుత్, తాగునీటి బిల్లుల్లో రాయితీలు కల్పించాలని కోరినట్టు ఆమె ఫోన్లో తెలిపారు.