రామోజీరావు హోటల్‌లో పేకాట

రామోజీరావు హోటల్‌లో పేకాట


విశాఖపట్నం: విశాఖలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన డాల్ఫిన్ స్టార్ హోటల్‌లో పేకాట ఆడుతున్న 8 మందిని  పట్టుకున్నట్టు సిటీ టాస్క్‌ఫోర్స్ సీఐ ఇలియాస్ అహ్మద్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. డాల్ఫిన్ హోటల్‌లో చాలా రోజులుగా పేకాట స్థావరం నడుపుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొందరు నగరంలోని ఓ పెద్ద హోటల్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారం కొద్ది రోజుల క్రితమే టాస్క్‌ఫోర్స్‌కు వచ్చింది. అయితే ఏ హోటల్ అనేది నిర్ధారణ కాలేదు. దీంతో కొంత సమయం వేచి ఉన్నారు.



మంగళవారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం అందడంతో సీఐ ఇలియాస్ అహ్మద్ తన బృందంతో సాయంత్రం డాల్ఫిన్ హోటల్ వద్దకు చేరుకున్నారు. బయటే వేచి ఉండి లోపల ఏ గదిలో పేకాట ఆడుతున్నారో ఇన్‌ఫార్మర్ ద్వారా నిర్ధారించకున్నారు. సమాచారం నిజమేనని తేలడంతో వెంటనే హోటల్‌పై దాడి చేశారు.



రూమ్ నెం. 605లో పేకాడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,51,600 నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా  విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, హైదరాబాద్, కడప ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. దాడి జరిగిన విషయాన్ని వెంటనే విశాఖ సీపీ అమిత్‌గార్గ్‌కు  తెలియజేశారు. ఆయన సూచనల మేరకు నిందితులను రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. నిందితులు నాలుగు రోజుల నుంచి అదే గదిలో పేకాట ఆడుతున్నారని ఇలియాస్ అహ్మద్ 'సాక్షి'కి తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top