ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
నల్లగొండ : జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు ఈ నెల 17 నుంచి (నేడు) 23 వరకు నిర్వహించ నున్నట్లు ప్రాంతీయ రవాణశాఖ కమిషనర్ మామిళ్ల చంద్రశేఖర్గౌడ్ తెలిపారు. సోమవారం నల్లగొండ డీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ భద్రతే మీ కుటుంబానికి రక్ష.., దయచేసి రోడ్లపై జాగ్రత్తగా ఉండండి..అనే నినాదంతో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు, లారీ అసోసియేషన్ యజమానులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఓవర్ స్పీడ్, హెల్మెట్, ట్రాఫిక్ నియమాలను పాటించడంపై వివరించనున్నారు. ప్రమాద రహిత జిల్లాలుగా మార్చేందుకు రవాణశాఖతో పాటు అనుబంధ శాఖల అధికారులు కూడా శాయశక్తులా కృషి చేయాలని కోరారు. విద్యాశాఖ, ఆర్అండ్బీ, ఎక్సైజ్, పోలీస్, మున్సిపాలిటీ శాఖల భాగస్వామ్యంతో వారోత్సవాలను విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. 18న కొర్లపహాడ్ వద్ద వాహనాదారులకు సీట్ బెల్టు పెట్టుకోవడంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. అదే రోజున రోడ్డు భద్రతవారోత్సవాలకు సంబంధిందిన ప్రణాళికను రూపొందిస్తామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తామని డీటీసీ తెలిపారు.