దుర్గమ్మను దర్శించుకున్న వైఎస్ జగన్
విజయవాడ(ఇంద్రకీలాద్రి): రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనకోసం గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతకుముందు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ నుంచి బుధవారం రోడ్డుమార్గంలో గుంటూరు బయలుదేరిన ఆయన విజయవాడకు చేరుకోగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రికి జగన్ చేరుకోగానే భక్తులు ఆయన్ను చుట్టుముట్టి కరచాలనం చేశారు.
ఏఈవోలు అచ్యుతరామయ్య, వెంకటరెడ్డి జగన్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు జగన్ను పలకరించగా వారికి ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జగన్ పేరిట ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందచేశారు. అక్కడ నుంచి నేరుగా గుంటూరు బయలుదేరివెళ్లారు.