తన్నే రోజులు ముందున్నాయ్!

తన్నే రోజులు ముందున్నాయ్! - Sakshi


సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజం



 నారాయణపేట : సీఎం కేసీఆర్‌కు తన్నే రోజులు ముందున్నాయ ని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు మహా పాదయాత్ర సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందన్నారు. ‘‘గతంలో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచి ఏం సాధించావ్.. జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యావ్.. బాంచన్‌దొర నీ కాల్మొక్తా అంటూ కాళ్లకాడ పడి ఉంటారని అనుకుంటున్నావేమో.. ఈ ప్రాజెక్టులు పూర్తికాకపోతే తన్నే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని ధ్వజమెత్తారు.



ఎవరైనా భూమిని సర్వే చేసి ప్రాజెక్టులు చేపడతారని, ఈయనేమో గూగుల్‌లో చూసి ప్రాజెక్టులను కట్టడం ఏమిటో అర్థం కావడంలేదన్నారు. మాయమాటలు చెప్పి ప్రజాసంక్షేమం విస్మరిస్తున్న కేసీఆర్‌కు అబద్ధాలకోరు అవార్డు ఇవ్వచ్చని విమర్శించారు. ప్రభుత్వం మల్లన్నసాగర్ రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కునేందుకు యత్నిస్తుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top