వద్దంటే వాన..!
► తీవ్రమవుతున్న కలుపు, చీడపీడల సమస్యలు
► జిల్లాలో 1,14, 480 హెక్టార్లలో పంటల సాగు
కర్నూలు(అగ్రికల్చర్): తేమ ఆరని విధంగా వర్షాలు పడుతుండటంతో పంటల్లో కలుపు, చీడపీడల సమస్యలు పెరుగుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 6.21 లక్షల హెక్టార్లు. ఈ నెల 25 వరకు 1,14,480 హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేశారు. వేరుశనగ, కంది ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యాయి. ఇప్పటి వరకు వేరుశనగ 40,583, కంది 34,390 హెక్టార్లలోను సాగు అయ్యాయి. పత్తి సాగు 23,121 హెక్లార్లకే పరిమితం అయింది. ఈ పంటల్లో ఒకవైపు కలుపు సమస్య, మరోవైపు పురుగులు, తెగుళ్లు ప్రబలడంతో రైతులు వాటిని నివారించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జూన్ నెల సాధారణ వర్షపాతం 77.2 మిమీ ఉండగా 150.4మిమీ వర్షపాతం నమోదు అయింది. బనగానపల్లె, కోడుమూరు మినహా మిగిలిన అన్ని మండలాల్లో సాధారణాన్ని మించి వర్షాలు కురిశాయి. నందవరంలో సాధారణం కంటే 338 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కొత్తపల్లిలో అత్యధికంగా 28.2 మిమీ వర్షపాతం నమోదైంది.