3జీ సేవలను మెరుగుపరచండి
– ‘ఫోన్యువర్ జీఎం’కు వినియోగదారుల ఫిర్యాదు
తిరుపతి అర్బన్: జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 3జీ సేవలను మరింత మెరుగుపరచాలని పలువురు వినియోగదారులు కోరారు. తిరుపతిలోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం 10:45 నుంచి 11:45 గంటల వరకు నిర్వహించిన ‘ఫోన్ యువర్ జీఎం’ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 ఫిర్యాదులు అందినట్లు సంస్థ జీఎం న్యూటన్ తెలిపారు. వాటిలో 3జీ సేవలు మెరుగుపరచాలని మదనపల్లె, వాల్మీకిపురం నుంచి రెండు, ల్యాండ్లైన్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని తిరుపతి నుంచి రెండు, సత్యవేడు నుంచి ఒక ఫిర్యాదు అందినట్లు చెప్పారు. బ్రాడ్బ్యాండ్ సేవల్లో లోపాన్ని సరిదిద్దాలని తిరుపతి నుంచి ఒకరు, తమ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని తిరుపతి నుంచి ఇద్దరు, ల్యాండ్ఫోన్లు రీకనెక్షన్కు దరఖాస్తు చేసుకున్నా వారాల తరబడి సిబ్బంది స్పందించడం లేదని తిరుపతి నుంచి ఒకరు, కుప్పం నుంచి ఒకరు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయా ఎస్డీఈలకు ఆదేశాలు ఇచ్చినట్లు జీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆపరేషనల్ విభాగం ఎస్డీఈ కృష్ణయ్య కూడా పాల్గొన్నారు.