ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం
తల్లీబిడ్డ క్షేమం
హైదరాబాద్: ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రసవించింది. హైదరాబాద్లోని ఐ.డి.ఎ బొల్లారానికి చెందిన మల్లేశ్ భార్య లక్ష్మి(30) గర్భిణి కావడంతో ప్రతి నెల సుల్తాన్బజార్ ప్రసూతి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. వైద్యులు కాన్పు నిమిత్తం ఆమెకు ఈ నెల 21న తేదీని ఇచ్చారు. శుక్రవారం ఉదయం లక్ష్మికి నొప్పులు వస్తుండడంతో కుటుంబ సభ్యులతో కలసి సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి బయలుదేరింది. బొల్లారంలో ఆర్టీసీ బస్సు ఎక్కారు.
ఆర్టీసీ బస్సు కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్దకు రాగానే లక్ష్మికి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. విషయం తెలుసుకున్న బస్సు డ్రైవర్ బస్సును పక్కకు తీసుకోవడంతో మహిళా ప్రయాణికుల సాయంతో లక్ష్మి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం లక్ష్మిని బస్సులోనే ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాలు సకాలంలో వైద్య సేవలు అందించడంతో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.