ఆకతాయి వేధింపులకు యువతి బలి
రంగారెడ్డి : ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుస్మిత(18) చేవెళ్ల వివేకానంద డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో గత కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డి ప్రేమించమని వేధిస్తున్నాడు. దీంతో యువతి విషయం తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది.
వారు సుభాష్ రెడ్డిని పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో తమ కూతురిని కళాశాల మాన్పించి ఇంటి వద్దే ఉంచుతున్నారు. అయినా వేధింపులు తగ్గకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుభాష్ రెడ్డికి ఇప్పటికే పెళ్లి జరిగి ఓ కూతురు ఉందని సమాచారం.