పట్టపగలు చోరీ
బుట్టాయగూడెం : మండలంలోని ముప్పినవారిగూడెం ఎస్సీ కాలనీ సమీపంలోని ఓ ఇంటిలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. బాధితురాలు జె.వెంకాయమ్మ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం వెంకాయమ్మ, ఆమె భర్త బుల్లిదొర బయటకు వెళ్లారు. దీనిని గమనించిన దుండగులు గునపంతో ప్రధాన ద్వారాన్ని పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని తొమ్మిదిన్నర కాసుల బంగారాన్ని దొంగిలించుకుపోయారు. ఏఎన్ఎంగా పనిచేస్తున్న వెంకాయమ్మ బుట్టాయగూడెం వైద్యశిబిరానికి వెళ్లారు. అయితే ఆ శిబిరం రద్దు కావడంతో బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి అక్కడి నుంచి 11గంటల 30 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటì తలుపులు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా, బీరువాలో పెట్టిన మూడు కాసుల గాజులు, మూడు కాసుల నక్లెస్, మూడు కాసుల నల్లపూసల దండ, అరకాసు మేటీలు, రూ.ఐదువందలు, రెండు చెక్బుక్కులు కనిపించలేదు. దీంతో ఆమె వెంటనే తన తమ్ముడు నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ శ్యామ్, కానిస్టేబుళ్లు సి.హెచ్.రవి, కె.రాము ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.