రాత్రికి రాత్రే దహనం చేసేశారు!

రాత్రికి రాత్రే దహనం చేసేశారు!


పెద్ద దోర్నాల (ప్రకాశం): అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవలో కోడలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ విషయం బయటకు రానీయకుండా కుటుంబసభ్యులు వెంటనే రాత్రికి రాత్రే దహన సంస్కారాలు పూర్తిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామానికి చెందిన మధుమతి (24)కి, వాళ్ల అత్తకు మధ్య గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కూడా కుటుంబంలో ఏదో గొడవ చోటుచేసుకుంది.



దీంతో మనస్తాపానికి గురైన మధుమతి గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతి విషయం బయటకు రానీయకుండా కుటుంబసభ్యులు తెల్లవారేలోపు దహన సంస్కారాలు ముగించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మార్కాపురం డీఎస్పీ శ్రీహరి రావు, తహశీల్దార్‌తో కలిసి శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మధుమతి ఆత్మహత్య చేసుకోలేదని, కుటుంబసభ్యులే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికే వెంటనే దహనం చేశారని స్థానికులు అంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top