'దొంగలా రావల్సి వస్తుందని ఊహించలేదు'
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతోందని ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి వచ్చారు. ఈ సందర్భంగా 'సాక్షి'తో మాట్లాడుతూ... ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి రాజమండ్రి చేరుకున్నానని తెలిపారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డిక్టేటర్ పాలనలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు.
కిర్లంపూడిలో నిరాహారదీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన దాసరికి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చి అక్కడి నుంచి సత్తుపల్లి వచ్చి అడవుల గుండా ప్రయాణించి చివరికి రాజమండ్రి చేరుకున్నానని తెలిపారు. ఈ తెల్లవారుజామున 4.45 గంటలకు రాజమండ్రి చేరుకోగలిగానని చెప్పారు. ఇది ఎప్పుడు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో మనం దొంగల్లా రావాల్సివస్తుందని అనుకోలేదని వాపోయారు.
తెలుగు జాతికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. క్రిమినల్స్ ను వెంటాడినట్టుగా తమను వెంటాడం సరికాదని భావ్యం కాదన్నారు. కిర్లంపూడి వెళ్లి ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్టు చెప్పారు. తనను పోలీసులు అనుమతిస్తారా, లేదా అనేది తెలియదన్నారు. తునిలో జరిగిన ఘటనలు పునరావృతం కాకూడదని దాసరి ఆకాంక్షించారు.