సంక్షోభంలో టీడీపీ
ఏలూరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం సంక్షోభంలో పడ్డాయని మహా ఫ్రంట్ వ్యవస్థాపకుడు వీజీఆర్ నారగోని పేర్కొన్నారు. ఏలూరులో మంగళవారం నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎస్టీ, మైనార్టీల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విభజిత రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో టీడీపీ సర్కారు పూర్తిగా విఫలమై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.
చంద్రబాబు ప్రస్తుతం మానసిక ఒత్తిడిలో ఉన్నారని, తన నీడను చూసి తానే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కలిగిస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు పార్టీలు, రెండు సామాజిక వర్గాలు మాత్రమే రాజ్యాధికారం అనుభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో 15 శాతం మందికి అధికారం బదాలాయించబడుతుంటే 85 శాతంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు రాజకీయ బానిసలుగా అణగదొక్కబడుతున్నారన్నారు.
అగ్రవర్ణాలకు దీటుగా రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యంతో ఈ నెల 13న విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మహాఫ్రంట్ ఏర్పాటు చేశామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర వర్గాల నాయకులకు మహాఫ్రంట్ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 2019 ఎన్నికల్లో రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.