కృష్ణా జలాల వివాదంపై చొరవ తీసుకోండి
సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ
సాక్షి, విజయవాడ బ్యూరో: ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవడంతో త్రిసభ్య కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా కృష్ణా జల వివాదాల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూచించారు. సీఎంకు రాసిన లేఖను ఆదివారం ఆయన మీడియాకు విడుదల చేశారు. కృష్ణా నది జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ కోసం యాజమాన్యం బోర్డు ఏర్పాటు చేయాలని విభజన బిల్లులో పేర్కొన్నారని తెలిపారు.
విభజన చట్టంలోని సెక్షన్ 84, 85, 86, 87ల ప్రకారం నదీ జలాల పంపిణీ విషయంలో స్పష్టంగా విధి విధానాలు రూపొందించినట్లు పేర్కొన్నారు.కేంద్రం త్రిసభ్య కమిటీలు వేసి విచారణ జరిపిస్తామనడం ఆమోదయోగ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా ఎందుకు ప్రతిఘటించడంలేదని సీఎంను ప్రశ్నించారు.