కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
పానగల్(వనపర్తి): కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనపర్తి జిల్లా పానగల్ మండలం రేమొద్దుల గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ప్రహ్లాద్(27), మల్లమ్మ(22) దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరు ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి 16 నెలల బాబు అనాథ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.