క్వార్టర్ల కౌన్సెలింగ్ బహిష్కరణ
► కార్పొరేట్ గైడ్లైన్స్ మేరకు కేటాయించాలని కార్మికుల ఆందోళన
► కౌన్సెలింగ్ వాయిదా వేసిన అధికారులు
కార్పొరేట్ గైడ్లైన్స్ మేరకు ఆర్జీ–2 ఏరియాలో క్వార్టర్లు కేటాయించాలని కౌన్సెలింగ్ను కార్మికులు బహిష్కరించారు. ఆర్జీ–1 ఏరియాలో ఈపీ ఆపరేటర్లకు ఎంసీ క్వార్టర్లు ఇస్తుండగా ఇక్కడ మాత్రం అర్హత లేదని చెబుతుండడంపై ఆందోళనకు దిగారు. మూడునెలల క్రితం నిర్వహించిన కౌన్సెలింగ్లో ఈవిధంగానే చేశారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులతో కార్మికులు గురువారం వాగ్వాదానికి దిగారు. చేంజ్ఆఫ్క్వార్టర్ల కౌన్సెలింగ్, నూతన క్వార్టర్ల కౌన్సెలింగ్ ఒకేరోజు నిర్వహించడంతో అన్యాయం జరుగుతోందని వాపోయారు. చివరకు క్వార్టర్ల కౌన్సెలింగ్ను వాయిదా వేయాలని కార్మిక సంఘాల నాయకులు ఐలి శ్రీనివాస్, నాచగోని దశరథంగౌడ్ డిమాండ్ చేశారు. దీంతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
రెండు కౌన్సెలింగ్లు ఒకేరోజు చేయడం అన్యాయం
రెండు కౌన్సెలింగ్లు ఒకేరోజు ఇవ్వడంతో జూనియర్లకు అన్యాయం జరుగుతోంది. ఆర్జీ–1 ఏరియాలో ఈపీ ఆపరేటర్లకు ఎంసీ టైపు క్వార్టర్లను కౌన్సెలింగ్లో ఇస్తుండగా ఆర్జీ–2 ఏరియాలో మాత్రం అమలులో లేదు. పర్సనల్ అధికారులు మా బాధలు పట్టించుకోవాలి.
– రవీందర్, ఈపీ ఆపరేటర్
ఇష్టారాజ్యంగా అధికారుల తీరు..
పర్సనల్ అధికారులు క్వార్టర్ల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పారదర్శకత లేదు. ఎంసీ క్వార్టర్ల కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ఉత్పత్తిలో కీలకపాత్ర వహిస్తున్న ఈపీ ఆపరేటర్లకు అన్యాయం జరుగుతోంది. – బేతి చంద్రయ్య, ఈపీ ఆపరేటర్, ఓసీ–3
పనులన్నీ విడిచిపెట్టి క్వార్టర్ల కోసం తిరగాలా..
పనులన్నీ విడిచిపెట్టి క్వార్టర్ల కోసం తిరిగాల్సి వస్తోంది. పద్ధతి లేకుండా అధికారుల ఇష్టారాజ్యంగా నడుస్తోంది. నూతన కార్మికులకు క్వార్టర్ల కౌన్సెలింగ్, చేంజ్ఆఫ్ క్వార్టర్ల కౌన్సెలింగ్ ఒకే రోజు నిర్వహించడంతో సీనియర్లు, జూనియర్లకు అన్యాయం జరుగుతోంది. దీన్ని వెంటనే మార్చాలి. – ఎం.దేవేందర్, ఈపీ ఆపరేటర్