ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి సహకరించాలి


దేవరకొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారని, ఈ మేరకు ప్రభుత్వానికి రైతులు సహకరించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. దేవరకొండలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలోని బీడు భూములకు సాగునీరు, ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు.



 డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవరకొండ మండలం గొట్టిముక్కల, ఇద్దంపల్లి, మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామాల్లో రిజర్వాయర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ముంపునకు గురవుతున్న రైతుల భూములకు ప్రభుత్వం మెరుగైన నష్టపరిహారం అందజేస్తుందని చెప్పారు. భూ సేకరణ, నష్టపరిహారం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సింహ్మ, వైస్‌ ఎంపీపీ వేణుధర్‌రెడ్డి, నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ నల్లగాసు జాన్‌యాదవ్, నాయకులు ముత్యాల సర్వయ్య, చీదెళ్ల గోపి, పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి, శిరందాసు కృష్ణయ్య, శంకర్‌నాయక్, మాడ్గుల యాదగిరి, సైదిరెడ్డి, వస్కుల కాశయ్య, ఆప్కో సత్తయ్య, బిక్కునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top