హామీల అమలులో ప్రభుత్వం విఫలం : జానా
తిరుమలగిరి (సాగర్) : హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చెందిందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం భ్రçష్టుపట్టి పోయిందని ధ్వజమెత్తారు. సోమవారం మండలంలోని రంగుండ్ల, యల్లాపురం, కొంపల్లి, బోయగూడెం, డొక్కలబావితండా, జువ్విచెట్టుతండాల్లో ఆయన పాల్గొని పార్టీ జెండాను ఎగరవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని పేర్కొన్నారు. కేసీఆర్ మూడు దశాబ్దాలు తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రం వచ్చేది కాదన్నారు. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి పాలనపై అవగాహన లేదన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, యడవల్లి రంగసాయిరెడ్డి, హన్మంతరావు, నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, కుందూరు వెంకట్రెడ్డి, శాగం పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ అనుముల ఏడుకొండలు, పిడిగం నాగయ్య, ఆంగోతు భగవాన్ నాయక్ పాల్గొన్నారు. అంతకుముందు ఆ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు సీఎల్పీ నేతకు వినతిపత్రాలు అందజేశారు.