నిందితులను శిక్షించాలని మృతదేహంతో ఆందోళన
కల్హేర్(నారాయణఖేడ్): నిందితులను గుర్తించి శిక్షించాలని మృతుడి బంధువులు అనుమానితుల ఇంటి ఎదుట శవం ఉంచి ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శుక్రవారం మండలంలోని మార్డిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మార్డికి చెందిన బొమ్మల శంకర్(42) గురువారం గ్రామ శివారులోని పెద్దచెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే.
శంకర్ మృత దేహానికి నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించి తీసుకొచ్చారు. కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆగ్రహంతో శంకర్ మృతదేహాన్ని అనుమానితుడు, అతడి సోదరుడు వెంకట్ ఇంటి వద్ద పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కల్హేర్ ఎస్ఐ ఏడుకొండలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు.
శంకర్ మృతి కేసులో పోలీసులు నిందితులను గుర్తించడం లేదని ఆరోపించారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు తెప్పించిన వీడియో కెమెరాను మృతుడి బంధువులు ఆగ్రహంతో ధ్వంసం చేశారు. ఎస్ఐ ఏడుకొండలు, టీఆర్ఎస్ నాయకులు రాంసింగ్, జనార్ధన్ తదితరులు ఆందోళనకారులకు నచ్చజెప్పారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది.