'కేసీఆర్ చెప్పేవి అందమైన అబద్ధాలే'


జడ్చర్ల: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకు అందమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మంగళవారం ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌తో కలిసి జైపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు నిజాయితీ, నిష్ఠల పట్ల నమ్మకం లేదన్నారు.



ఆయన తెలంగాణ కోసం చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజే భగ్నమైందన్నారు. ఆయన ఏనాడూ పార్లమెంట్‌లో తెలంగాణ గురించి మాట్లాడింది లేదని విమర్శించారు. 'ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్‌ గాంధీలను కలిసిన అనంతరం కేసీఆర్ మా ఇంటికి వచ్చి తనను సీఎం చేయాలని కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి సీఎం అవ్వమని ఆయనకు చెప్పాను. సంబరంగా తిరిగి వెళ్లిన ఆయన హైదరాబాద్ రాగానే మాట మార్చి కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు' అని జైపాల్ రెడ్డి విమర్శించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top