అసెంబ్లీకి రాని బాబు.. ఛాంబర్కే పరిమితం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకాలేదు. కీలకమైన ఓటుకు కోట్లు కుంభకోణం అంశంపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చ జరపాలని పట్టుబడుతున్న నేపథ్యంలో చంద్రబాబు చర్చలో లేకపోవడం సర్వత్రా విమర్శ నెలకొంది. ఓటుకు కోట్లు కేసులో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆయన పార్టీకి చెందిన మరికొందరు ప్రధాన పాత్ర ఉన్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టిన విషయం తెలిసిందే.
మరోపక్క, ఈ కేసునుంచే బయటపడేందుకే చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారనే విమర్శలు కూడా బాహాటంగానే వస్తున్నాయి. దీంతో ఏకంగా రాష్ట్ర భవిష్యత్తును తన వ్యక్తిగత కారణంగా కేంద్రం వద్ద ఫణంగా పెట్టిన చంద్రబాబునాయుడిపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఆగ్రహం ప్రదర్శిస్తోంది. ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఓటుకు కోట్లు కుంభకోణం కేసుపై చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో రెండుసార్లు సమావేశం వాయిదా కూడా పడింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సమావేశాలవైపు రాకుండా కేవలం ఛాంబర్ కే పరిమితమయ్యారని విమర్శలు చేస్తున్నారు.