నేనేంటో నీ అయ్యకు తెల్సు
- మంత్రి కేటీఆర్పై జానా విసుర్లు
సాక్షి, హన్మకొండ : 'నేనంటే ఏంటో నీ అయ్యకు తెలుసు. నీకు సరిగా తెల్వది..' అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్పై మాజీ మంత్రి జానారెడ్డి విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన రైతు భరోసాయాత్రలో ఆయన కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. ‘ఈ మధ్య వరంగల్ జిల్లా శాయంపేటలో మంత్రి కేటీఆర్.. ‘జానారెడ్డి ఏమైనా జానెడు పని చేస్తడా..అని అన్నడంట. అది వింటే రక్తం కుతకుతలాడుతుంది. జానారెడ్డి జానెడు బెత్తడా అంటున్నడు. ఆయన బెత్తెడు చేసిండా. బెత్తెడు పని చేయలేనోనికి జానెడు పని గురించి మాట్లాడే అర్హత లేదు' అంటూ ఊగిపోయారు.
ఇంకా.. 'జానారెడ్డి అంటే జనం మనిషి. మండల వ్యవస్థను తెచ్చింది జానారెడ్డి. అంజుమన్ పేరుతో రూ. 2000 కోట్ల రుణమాఫీ చేసింది జానారెడ్డి. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో పెరిగిన ఎరువల ధరలు తగ్గించింది జానారెడ్డి. ముప్పై ఏళ్ల కింద నర్సంపేటల ఫారెస్టు దొంగలను పట్టుకునేందుకు అడవులెంబడి తిరిగింది జానారెడ్డి. గ్రామీణ క్రాంతి పథకం ద్వారా పేద రైతుల పొలాలళ్ల బావులు తవ్వించింది జానారెడ్డి. అందుకే నేనేందో నీకు తెల్వదు. నీ అయ్యకు తెలుసు. చేసిన పనులకు ప్రచారం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. దీన్ని అలుసుగా తీసుకుని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం నా అభిమానులకు తెలిస్తే చూస్తూ ఊరుకోరు..’అంటూ హెచ్చరించారు.