లాఠీపై.. నీళ్లు!
– పోలీసుశాఖలో 800లకు పైగా ఖాళీలు
– 346 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్
– చిత్తూరులో 211, తిరుపతిలో 135 పోస్టులే
– నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ
– 20 వేల మంది వరకు పోటీపడే అవకాశం
చిత్తూరు (అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుశాఖలో ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తొలిసారిగా చిత్తూరు, తిరుపతి పోలీసు జిల్లాలకు వేర్వేరుగా నియామకాలు చేపట్టనున్నారు. ఇందులో రెగ్యులర్ పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను సైతం భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే జిల్లాలోని పోలీసు శాఖలో చూపిన ఖాళీలు నిరుద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.
న్యాయమేనా?
చిత్తూరు, తిరుపతి పోలీసు జిల్లాలు విడిపోక ముందు 2013లో జిల్లా మొత్తం ఒక యూనిట్గా పరిగణనలోకి తీసుకుని అప్పట్లో పోలీసుశాఖలో పోస్టులను భర్తీ చేశారు. దాదాపు 500కు పైగా పోస్టులు జిల్లా పోలీసుశాఖలో భర్తీ అయ్యాయి. దాని తరువాత చిత్తూరు, తిరుపతి పోలీసు జిల్లాలుగా విడిపోయాయి. గత ఏడాదే సిబ్బంది పంపకాలు కూడా పూర్తయ్యాయి. దీని తరువాత కనీసం హోమ్గార్డు సెలెక్షన్స్ కూడా జరగలేదు. ప్రతీ ఏటా పోలీసు శాఖలో పదవీ విరమణ చేస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో 2015 జూన్ వరకు చిత్తూరు పోలీసు జిల్లాలో 245 సివిల్, ఆర్ముడు విభాగంలో 220 ఖాళీలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. తిరుపతిలో 210 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నట్లు చూపించారు. కానీ తాజాగా విడుదలయిన నోటిఫికేషన్లో చిత్తూరులో 211 (సివిల్ 132, ఏఆర్ 79), తిరుపతిలో 135 (సివిల్ 71, ఏఆర్ 64) పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అంటే జిల్లా మొత్తం ఉన్న ఖాళీల్లో సగం పోస్టులు కూడా భర్తీకి నోచుకోకపోవడం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.
భారీగా పోటీ
పోలీసు కొలువులకు భారీ స్థాయిలో పోటీపడే అవకాశం ఉంది. ఎంతగా అంటే జిల్లాలో ఈ ఉద్యోగాల కోసం దాదాపు 20 వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాస్త ఊరట
గతంలో ఉన్న ప్రాథమిక పరీక్ష 5 కి.మీ పరగుపందాన్ని ఈ సారి రద్దు చేయడం నిరుద్యోగులకు కాస్త ఊరట కలిగించే విషయం. తొలుత ప్రిలిమినరీ పేరిట రాత పరీక్ష నిర్వహించి, ఇందులో అర్హత సాధించిన వాళ్లకు దేహదారుఢ్య పరీక్ష, 1600, 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్జంప్ను ఉంచారు. ఇందులో అర్హత సాధించిన తరువాత మళ్లీ తుదిగా రాత పరీక్షను నిర్వహించి మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
వచ్చేనెల 3 నుంచి..
దరఖాస్తులను ఈ రి పూర్తిగా ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఆగస్టు 3వ తేదీన ఠీఠీఠీ.ట్ఛఛిటuజ్టీఝ్ఛn్ట.్చpఞౌlజీఛ్ఛి.జౌఠి.జీn అనే వెబ్సైట్లో సెప్టెంబర్ 14లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ రాత పరీక్షను అక్టోబర్ 16న నిర్వహిస్తారు. చిత్తూరులో రెండు పరీక్షా కేంద్రాలు, తిరుపతిలో రెండు పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష జరుగుతుంది. 2016 జూలై 1కి ఇంటర్ ఉత్తీర్ణులైన ఓబీసీలు, పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.