చింతమనేని గ‘లీజు’
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చేపల చెరువుల బహిరంగ వేలంలో అధిక మొత్తం లీజు సొమ్ము చెల్లించేందుకు ముందుకు వచ్చిన ఔత్సాహికులకు కాకుండా అతి తక్కువ మొత్తంలో కోట్ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుడికి భూములు కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది. పెదపాడు మండ లం వీరమ్మకుంటలో బుధవారం ఒకింత ఉద్రిక్తతకు తెరలేపిన ఈ ఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి.
కలపర్రులోని రాజగోపాలస్వామి దేవస్థానానికి సంబంధించి 16 ఎకరాల 75సెంట్ల భూమి వీరమ్మకుంటలో ఉంది. చుట్టుపక్కల పొలాలన్నీ చేపల చెరువులుగా మారిపోవడంతో ఈ భూమిలో గత నాలుగేళ్లుగా సాగు చేయడం లేదు. దీంతో రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులను సంప్రదిం చిన దేవాదాయ శాఖ అధికారులు ఆ భూముల్లో చేపల చెరువుల సాగుకు అనుమతులు తీసుకొచ్చారు. ఆ భూములకు సంబంధించి మంగళవారం వీరమ్మకుంట పంచాయతీ కార్యాలయం వద్ద బహిరంగ వేలం నిర్వహించారు.
ఇందుకోసం 10 రోజుల క్రితం పత్రికల్లో బహిరంగ వేలం ప్రకటన కూడా ఇచ్చారు. ఆ భూముల్లో చేపలు పెంచుకునే హక్కు వేలం దక్కిం చుకునేందుకు చాలామంది ఔత్సాహికులు వచ్చారు. ప్రభుత్వ పాట రూ.3 లక్షలుగా నిర్ణయించి బహిరంగ వేలం మొదలుపెట్టగా, రూ.7 లక్షల 10వేల వరకు పాట వెళ్లింది. అదే సమయంలో చింతమనేని ప్రభాకర్ అనుచరులు రంగప్రవేశం చేశారు. ‘ఎమ్మెల్యే గారి ఆబ్లిగేషన్.. చెరువుల లీజు మాకే కావాల’ంటూ హల్చల్ చేశారు.
ఇదెక్కడ చోద్యమని మిగిలిన పాటదారులు ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యం చేయబోయారు. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన వేలం నిర్వాహకుడు, ఆలయ ఈవో సాంబశివరావు చివరకు రూ.3 లక్షల 20 వేలకే పాట ఖరారు చేసి చింతమనేని అనుచరుడికి కట్టబెట్టేశారు. బహిరంగంగా జరిగిన వేలంలోనూ ఇంత దారుణం జరిగితే ఎలా అంటూ మిగిలిన పాటదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అవసరమైతే దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కలసి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.